PBKS vs CSK : ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు నిద్రలేని రాత్రిళ్లు మిగుల్చుతున్న పంజాబ్ కింగ్స్(Punjab Kings) మరోసారి రఫ్పాడించింది. ధర్శశాలలో జరుగుతున్న మ్యాచ్లో రాహుల్ చాహర్(3/23), హర్షల్ పటేల్(3/24)ల విజృంభణతో డిఫెండింగ్ చాంపియన్ పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే.. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(43) మరోసారి ఆపద్భాంధవుడిగా మారగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(32), డారిల్ మిచెల్(30)లు ఫర్వాలేదనిపించారు. దాంతో, చెన్నై నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగలిగింది.
టాస్ ఓడిన చెన్నైని ఆది నుంచి వరుస షాక్లు తగిలాయి. పవర్ ప్లేలో ఓపెనర్ అజింక్యా రహానే(9) వికెట్ కోల్పోయిన సీఎస్కే.. ఆ తర్వాత మరింత కష్టాల్లో పడింది. స్పిన్నర్ రాహుల్ చాహర్ ఒకే ఓవర్లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(32), డేంజరస్ శివం దూబే(0)ను గోల్డెన్ డక్గా వెనక్కి పంపాడు. దాంతో, అప్పటిదాకా పటిష్టస్థితిలో ఉన్న చెన్నై.. 69 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. డారిల్ మిచెల్(30), మోయిన్ అలీ(17)లు ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నారు. అయితే.. ఆ కాసేపటికే మిచెల్ను హర్షల్ పటేల్ ఎల్బీగా ఐట్ చేసి సీఎస్కే మరింత ఒత్తిడిలో పడింది.
ఆ దశలో మోయిన్ అలీ(17), మిచెల్ సాంట్నర్(11) జతగా రవీంద్ర జడేజా(43) జట్టు స్కోర్ వంద దాటించారు. శార్ధూల్ ఠాకూర్(11) ఉన్నంత సేపు ధనాధన్ ఆడాడు. జడేజాతో ఏడో వికెట్కు 28 రన్స్ జోడించాడు. ఈ సీజన్లో ఆఖరి ఓవర్లలో బౌండరీలతో చెలరేగుతున్న ఎంఎస్ ధోనీ(0)ని హర్ష్ల్ లో యార్కర్తో బౌల్డ్ చేశాడు. అర్ష్దీప్ సింగ్ వేసిన 20వ ఓవర్లో జడేజా .. సిక్సర్ బాది తర్వాతి బంతికే ఔటయ్యాడు. దాంతో, 180 ప్లస్ కొడుతుందనుకున్న చెన్నై 167 పరుగులకే పరిమితమైంది.