కోహ్లి లేకుండా టీ20 వరల్డ్ కప్ టీమ్.. కలలో కూడా ఊహించని ప్లేయర్‌కు చోటు.. బిహేవ్ సంజయ్..!

టీ20 వరల్డ్ కప్ కోసం త్వరలోనే బీసీసీఐ భారత జట్టును ప్రకటించనుంది. ఈ నెలాఖరులోగా 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును సెలక్టర్లు ప్రకటించనున్నారు. వికెట్ కీపర్, ఆల్‌రౌండర్ స్లాట్లు మినహా మిగతా అన్ని స్థానాలకు ఆటగాళ్ల ఎంపిక విషయంలో దాదాపు క్లారిటీ వచ్చేసింది. బీసీసీఐ జట్టును ప్రకటించే లోపే.. టీ20 ప్రపంచ కప్‌కు ఈ ఆటగాళ్లను ఎంపిక చేస్తే బాగుంటుందంటూ.. మాజీ క్రికెటర్లు తమ జట్లను ఎంపిక చేస్తున్నారు.

అంబటి రాయుడు, ఇర్ఫాన్ పఠాన్ ఇప్పటికే తమ తమ జట్లను ప్రకటించగా.. తాజాగా కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఆ జాబితాలో చేరాడు. టీమ్‌ను ఎంపిక చేసుకునే విషయంలో మంజ్రేకర్ ఎంతో ధైర్యం చేశాడు. ఐపీఎల్‌లో అదరగొడుతున్న స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి మంజ్రేకర్ ప్రకటించిన జట్టులో చోటు దక్కలేదు.

రోహిత్ శర్మను కెప్టెన్‌గా ప్రకటించిన మంజ్రేకర్.. ఇటీవలే సూపర్ సెంచరీతో ఫామ్‌లోకి వచ్చిన యశస్వి జైశ్వాల్‌ను అతడికి ఓపెనింగ్ జోడీగా ఎంపిక చేశాడు. మూడో స్థానానికి విరాట్ కోహ్లి బదులు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను ఎంపిక చేసిన మంజ్రేకర్.. నాలుగో స్థానానికి సూర్యను ఎంపిక చేశాడు. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్‌గా రిషబ్ పంత్‌ను ఎంపిక చేసిన ఈ మాజీ ప్లేయర్.. కేఎల్ రాహుల్‌‌ను ఆరో స్థానానికి ఎంపిక చేశాడు.

గతంలో తానే బిట్స్ అండ్ పీసెస్ ప్లేయర్ అంటూ విమర్శించిన రవీంద్ర జడేజా‌ను ఆల్‌రౌండర్‌ కోటాలో ఎంపిక చేసిన సంజయ్ మంజ్రేకర్.. స్పిన్నర్ల కోటా యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లను ఎంపిక చేశాడు. పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లతోపాటు ఆవేశ్ ఖాన్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్‌లను ఎంపిక చేశాడు. ఆల్‌రౌండర్‌ కోటాలో హార్దిక్ పాండ్యను ఎంపిక చేయని మంజ్రేకర్.. అతడి సోదరుడు కృనాల్ పాండ్యను మాత్రం 15వ ఆటగాడిగా సెలక్ట్ చేశాడు.

ఈ జట్టును చూశాక కోహ్లి ఫ్యాన్స్ సంజయ్ మంజ్రేకర్‌ను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. విరాట్ కోహ్లిని కాదని కృనాల్ పాండ్యను ఎలా ఎంపిక చేస్తావ్.. తాను టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక చేస్తారని కృనాల్ కూడా అనుకోడు. అలాంటిది నువ్వు అతణ్ని ఎలా ఎంపిక చేశావ్ అని ప్రశ్నిస్తున్నారు. రింకూ సింగ్ లాంటి ఆటగాడు జట్టులో ఫినిషర్ రోల్‌ను ఎవరు పోషిస్తారని మంజ్రేకర్‌ను నిలదీస్తున్నారు.

ఆవేశ్ ఖాన్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్, కృనాల్ పాండ్యలను ఐపీఎల్ ఆటను చూసి సెలక్ట్ చేశావా..? మరి కోహ్లిని ఎందుకు ఎంపిక చేయలేదు? అని ఓ నెటిజన్ సంజయ్ మంజ్రేకర్‌ను ప్రశ్నించాడు.

ఐపీఎల్ ఆరంభంలో ఓ మ్యాచ్‌ టాస్ సమయంలో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ హార్దిక్ పాండ్యను ట్రోల్ చేయగా.. బిహేవ్ అంటూ మంజ్రేకర్ వారికి సూచించాడు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ.. నెటిజన్లు బిహేవ్ మంజ్రేకర్ అంటూ చురకలు అంటిస్తున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-26T11:09:15Z dg43tfdfdgfd