రాజస్థాన్ రాయల్స్ పేసర్ సందీప్ శర్మ చరిత్ర సృష్టించాడు. జైపూర్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 18 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసిన సందీప్ శర్మ.. రాజస్థాన్ తరఫున ఐదు వికెట్ల హాల్ సాధించిన తొలి భారత పేసర్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. రాజస్థాన్ తరఫున ఐదుగురు బౌలర్లు ఐదు వికెట్ల హాల్ సాధించగా.. అందులో యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ మాత్రమే భారత క్రికెటర్లు కావడం గమనార్హం.
ఐపీఎల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో భారత పేసర్ సందీప్ శర్మ కావడం విశేషం. భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా తర్వాతి స్థానాల్లో ఉన్న సందీప్.. 119 మ్యాచ్ల్లో 130 వికెట్లు తీశాడు. ముంబైతో మ్యాచ్లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, గారెల్డ్ కోయెట్జీ వికెట్లను పడగొట్టిన సందీప్ రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
సందీప్ శర్మ 2018 నుంచి 2021 వరకు నాలుగు సీజన్లపాటు సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. 2018లో సందీప్ శర్మను రూ.3 కోట్లకు కొనుగోలు చేసిన సన్రైజర్స్.. 2021 సీజన్ తర్వాత రిలీజ్ చేసింది. 2022 సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన సందీప్ శర్మ.. ఐపీఎల్ 2023కి ముందు నిర్వహించిన మినీ వేలంలో అన్సోల్డ్గా మిగిలాడు. అయితే ప్రసిద్ధ్ కృష్ణ గాయపడటంతో రాజస్థాన్ రాయల్స్ అతడి స్థానంలో రూ.50 లక్షల బేస్ ప్రైజ్కు సందీప్ శర్మను రీప్లేస్మెంట్గా తీసుకుంది.
ముంబై ఇండియన్స్పై ఐదు వికెట్ల హాల్ సాధించిన తర్వాత.. 2023 వేలంలో తాను అమ్ముడుపోని విషయాన్ని సందీప్ శర్మ గుర్తు చేసుకున్నాడు. వేలంలో అన్సోల్డ్గా మిగిలిపోయి.. రీప్లేస్మెంట్గా అవకాశం దక్కించుకున్న తనకు ఆడే ప్రతి మ్యాచ్ బోనసేనని సందీప్ తెలిపాడు. ఈ సీజన్లో లక్నో, ఢిల్లీతో జరిగిన మ్యాచ్ల్లో ఆడిన సందీప్ శర్మ.. గాయం కారణంగా మిగతా మ్యాచ్లకు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకొని ఫిట్నెస్ సాధించిన ఈ రాజస్థాన్ పేసర్ ముంబైతో మ్యాచ్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్లో డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయాలంటే ఎంతో ధైర్యం కావాలన్న సందీప్ శర్మ.. ధైర్యంతోపాటు ప్రణాళికలను అమలు చేయాలన్నాడు.